గుజరాత్ ను ముంచెత్తిన వర్షాలు.. 9 మంది మృతి

గుజరాత్ ను ముంచెత్తిన వర్షాలు.. 9 మంది మృతి

గుజరాత్  రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తుతున్నాయి.జునాగఢ్, జామ్‌నగర్, మోర్బి, కచ్, సూరత్ , తాపీ సహా వివిధ జిల్లాలలో నిరంతరాయంగా కురుస్తున్న వర్షంతో జన జీవనం స్థంభించింది. దీంతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.  గుజరాత్ లో పలు నగరాల్లో  భారీ నీటి ఎద్దడి ఏర్పడటంతో  గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లపై ప్రజలు తిరగడానికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. వరద నీరు రోడ్లపై భారీగా ప్రవహించడంతో రోడ్లను గుర్తించలేకపోయారని వాతావరణ కేంద్రం తెలిపింది.   భారీవర్షాల తాకిడికి ఇప్పటివరకు తొమ్మిది మంది ( వార్త రాసే సమయానికి) మృతి చెందారని ఐఎండీ తెలిపింది.  

గుజరాత్‌లో   30 గంటల పాటు ఎడతెరిపి లేకుండా వర్షం పడింది.  దీంతో పలు ప్రాంతాల్లో  200 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. గత రెండు రోజుల్లో  (వార్త రాసే సమయానికి) తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. పంచమహల్ జిల్లా ఆనంద్‌ నగరంలో పలు చోట్ల  గోడలు కూలి నలుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పాయారు.ఇంకా జామ్‌నగర్,అర్వల్లి జిల్లాల్లోఇద్దరు వరద నీటిలో కొట్టుకుపోయారు. అమ్రేలి జిల్లాలోని లాథి తాలూకాలో ఒక మహిళ వరద నీటిలో మునిగిపోయింది. శనివారం (జూలై 1)పలు ప్రాంతాల్లో  భారీ వర్షం కురిసింది. ఇంకా మరో రెండురోజుల పాటు ( జులై2,3 తేదీలు) ఈదురుగాలులతో .. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (IMD)   అంచనా వేసింది.

జునాగఢ్, జామ్‌నగర్, మోర్బి, కచ్, సూరత్ మరియు తాపీ సహా వివిధ జిల్లాల్లో నిరంతరాయంగా గురు, శుక్రవారాల్లో (జూన్ 29,30)  వర్షం కురిసింది. దీంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారు. పలు ప్రాంతాల్లో  భారీగా  నీటి ఎద్దడి ఏర్పడి  గ్రామీణ ప్రాంతాల్లోని రోడ్లను వరద నీరు కప్పేసింది.  శుక్రవారం ( జూన్ 30) మధ్యాహ్నం 12 గంటలకు  గుజరాత్ లోని 37 తాలూకాల్లో (అడ్మినిస్ట్రేటివ్ సబ్‌డివిజన్‌లలో ) 100 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యాయని స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్స్ సెంటర్ (SEOC) వెల్లడించింది.

తాపి జిల్లాలోని వ్యారా తాలూకాలో అత్యధిక వర్షపాతం 299 మి.మీ.  నమోదైంది. జునాగఢ్ నగరం (298 మిమీ), తాపీలోని వలోద్ తాలూకా (288 మిమీ), సూరత్‌లోని మహువ (256 మిమీ), జామ్‌నగర్ నగరం (236 మిమీ), సూరత్‌లోని బార్డోలి (223 మిమీ) వర్షపాతం నమోదైంది.  జామ్‌నగర్ జిల్లాలోని జామ్‌నగర్ తాలూకాలో శుక్రవారం (జూన్ 30)  ఉదయం 6 నుంచి  మధ్యాహ్నం 12 గంటల వరకు 177 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.  దీంతో జామ్‌నగర్ నగరంలో భారీ నీటి ఎద్దడి ఏర్పడింది. భారీ వర్షాల కారణంగా నవ్‌సారి మందిర్ గామ్‌లోని అండర్‌పాస్‌లో ఒక కారు చిక్కుకుపోయింది. అగ్నిమాపక శాఖ సిబ్బంది స్థానికుల సహకారంతో కారులో ఉన్న నలుగురిని సురక్షితంగా బయటకు తీశారు.

గాంధీనగర్, ఖేడా, అహ్మదాబాద్, ఆనంద్, వడోదర, భరూచ్, సూరత్, నవ్సారి , వల్సాద్  జిల్లాల్లో  శనివారం ( జులై 1)  భారీ వర్షాలు ( వార్త రాసే సమయానికి) కురుస్తున్నాయి.  మరో రెండు రోజుల పాటు ఆది, సోమ వారాలు ( జులై 2,3 తేదీలు) గుజరాత్ రాష్ట్రంలోని పలు  ప్రాంతాల్లో ఈదురు గాలులతో ..  తేలికపాటి నుండి  ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని  ఐఎండీ శాఖ తెలిపింది.